
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తీసుకెళ్తుందని.. అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానం అమలు చేయాలని సూచించారు రేవంత్. టెలీమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదన్నారు. టెలీమెట్రీ విధానం అమలుకు అవసరమైన ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుంది.. వెంటనే టెలీమెట్రీ విధానం అమలు చేయాలని సూచించారు.ఈ విషయంపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు రేవంత్.
ALSO READ | రాబోయే మూడు నెలలు జాగ్రత్త.. ఎక్కడా నీటి సమస్య రావొద్దు
మంత్రి ఉత్తమ్ తో కలిసి ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ... నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘానిదేనన్నారు రేవంత్. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు .
రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రేవంత్.ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు రేవంత్.
నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో వెంటనే సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం రేవంత్.