
- ఏప్రిల్ 24న ‘భారత్ సమిట్’పై రివ్యూ
- ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం టీమ్
- ఏడు రోజుల పాటు పలు ప్రముఖ కంపెనీలతో చర్చలు
- రూ.12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
హైదరాబాద్, వెలుగు: జపాన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు ప్రజాప్రతినిధులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం.. ఏడు రోజుల పాటు పలు ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపి రూ.12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా సుమారు 30,500 కొత్త ఉద్యోగాలు రానున్నాయి.
ఇక ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ అంతర్జాతీయ పర్యటనల ద్వారా మొత్తం రూ.2,44,962 కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటి ద్వారా 80,500 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులతో 49,550 ఉద్యోగాలు.. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్ పర్యటనల్లో రూ.14,900 కోట్ల పెట్టుబడులు సాధించారు. గతేడాది దావోస్ పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కాగా, శంషాబాద్ఎయిర్పోర్టు నుంచి నేరుగా సంగారెడ్డికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ సీనియర్నేత జగ్గారెడ్డి కూతురు నిశ్చితార్థానికి హాజరయ్యారు.
ఏప్రిల్ 24న ‘భారత్ సమిట్’పై రివ్యూ
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 25, -26 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలోని నోవాటెల్లో ‘‘భారత్ సమిట్–2025’ పేరుతో ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. దీనికి దాదాపు 100 దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు, 100 ప్రగతిశీల రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఈ సదస్సు నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేయనున్నారు.