టీటీడీ తరహాలోయాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు

టీటీడీ తరహాలోయాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు
  • ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
  • హైదరాబాద్ బయట వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్ 
  • అనంతగిరిలో నేచర్ వెల్​నెస్ సెంటర్
  • రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం
  • హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు 
  • ఫోర్త్ సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి
  • ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీటీడీ లెక్కనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధివిధానాలు ఉండాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పారు. స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులపై శుక్రవారం సెక్రటేరియెట్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించాలని అధికారులను ఆయన 
ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త టూరిజం పాలసీలు తీసుకురావాలని చెప్పారు.


ఇందుకోసం టూరిజంలో ముందున్న రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని.. వాటిలో మెరుగైనవి, మన రాష్ట్రానికి అనువైన వాటిని అనుసరించాలని సూచించారు. యాదగిరిగుట్టపై వారంలోగా నివేదిక ఇవ్వండి.. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అసంపూర్తిగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఏయే అభివృద్ధి పనులు జరిగాయి? ఇంకా ఏయే పనులు జరగాల్సి ఉంది? అనే వివరాలతో వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ‘‘ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడికి వచ్చే భక్తులు బస చేసేందుకు కాటేజీల నిర్మాణం చేపట్టాలి. ఇందుకోసం దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలి” అని సూచించారు. అదే విధంగా కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు. ‘‘ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించాలి. అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలి’’ అని సూచించారు.  

Also Read :- ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ పెంపునకు సహకరించండి

  • విడివిడిగా టూరిజం పాలసీలు

టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలు రూపొందించాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలు, చారిత్రక స్థలాలతో పాటు అటవీ ప్రాంతాలు, వైద్య సదుపాయాలన్నింటినీ పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. రవాణాతో పాటు వసతి, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలు ఉండాలని చెప్పారు. ‘‘కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలి. కొన్ని చోట్ల రాత్రి విడిది కోసం కాటేజీలను నిర్మించాలి. పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి, వేటిని ముందుగా అభివృద్ధి చేయాలనేది టూరిజం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు కలిసికట్టుగా నిర్ణయించాలి. కేవలం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే సరిపోదు. హరిత హోటళ్లు, వసతి గృహలు నిర్మించి వదిలేస్తే చాలదు. నిరంతరం వీటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షించగలం” అని అధికారులకు చెప్పారు. అందుకే కొత్త ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. అటు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని తెలిపారు.ఈ సమావేశంలో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, టూరిజం ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.

  • అందరి దృష్టిని ఆకర్షించేలా మెడికల్ టూరిజం  

హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చే వారికి వైద్య సేవలందించే వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. ‘‘ఆన్ లైన్ లోనే అన్ని సేవల వివరాలను అందుబాటులో ఉంచాలి. నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి హాస్పిటల్ కు వెళ్లి.. డాక్టర్ల అపాయింట్​మెంట్, ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలి. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలి” అని అన్నారు. 

యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడికి వచ్చే భక్తులు బస చేసేందుకు కాటేజీల నిర్మాణం చేపట్టాలి. ఇందుకోసం దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలి.
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించాలి. అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర టెంపుల్​ పునర్నిర్మాణం చేపట్టాలి.