మెదక్ జిల్లాలో డిజిటల్​కార్డ్​ సర్వే పరిశీలన : సీఎంవో స్పెషల్​ఆఫీసర్ ​సంగీత

మెదక్ జిల్లాలో డిజిటల్​కార్డ్​ సర్వే పరిశీలన : సీఎంవో స్పెషల్​ఆఫీసర్ ​సంగీత

మెదక్​ టౌన్, వెలుగు: డిజిటల్​కార్డ్​ల సర్వేను పక్కాగా నిర్వహించాలని సీఎంవో స్పెషల్​ఆఫీసర్ ​సంగీత అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మెదక్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల వివరాలను సేకరించి సరైన విధంగా నమోదు చేయాలని సూచించారు.

 కొన్నిచోట్ల  సర్వే తుది దశకు చేరుకుందని, వివరాలు పక్కాగా నమోదయ్యాయా లేదా అని చెక్​చేసుకోవాలన్నారు. ఆమె వెంట అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఈ డిస్టిక్ మేనేజర్ సందీప్ ఉన్నారు.

 ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు

పుల్కల్: ప్రతి కుటుంబానికీ డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పైలెట్​ప్రాజెక్ట్​గా నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి సర్వే చేస్తుందని కలెక్టర్​ క్రాంతి అన్నారు. శనివారం పుల్కల్ మండలంలోని ఇసోజీపేటలో చేపట్టిన సర్వేను పరిశీలించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామన్నారు.

తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు ఇద్దరు అధికారుల బృందం గ్రామాల్లో సర్వే చేస్తుందన్నారు. ఈ నెల 3 నుంచి 7 వరకు సర్వే పనులు కొనసాగుతాయని, ఈ సర్వే ద్వారా ప్రతీ  కుటుంబం  ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. ఆమె వెంట డీపీవో సాయిబాబా, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో అనందమేరీ, ఎంపీవో శ్రీకాంత్ ఉన్నారు.