డిమాండ్​కు అనుగుణంగా థర్మల్ పవర్​ప్లాంట్లకు బొగ్గు సప్లై చేయాలి:సింగరేణి సీఎండీ బలరామ్

డిమాండ్​కు అనుగుణంగా థర్మల్ పవర్​ప్లాంట్లకు బొగ్గు సప్లై చేయాలి:సింగరేణి సీఎండీ  బలరామ్
  • సింగరేణి సీఎండీ  బలరామ్  ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్  అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్  పవర్​ ప్లాంట్లకు ప్రతి రోజూ 2.6 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్  అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్  సింగరేణి భవన్  నుంచి అన్ని ఏరియాల జనరల్  మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. 

వేసవి సమీపిస్తుండడంతో దేశంలో విద్యుత్  డిమాండ్  పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని  అన్ని ఏరియాల్లో ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి పెంచాలని సూచించారు. కర్నాటక పవర్  కార్పొరేషన్  నుంచి వస్తున్న డిమాండ్  మేరకు రోజుకు 11 రేకుల బొగ్గు సప్లై చేయాలన్నారు. 

బొగ్గు రవాణా విషయంలో రైల్వే విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. సింగరేణితో ఇంధన ఒప్పందాలు ఉన్న అన్ని విద్యుత్  కేంద్రాలకు అవసరమైన మేరకు బొగ్గు సప్లై చేయాలన్నారు. 

కొత్తగూడెం ఏరియా మెరుగైన ఉత్పత్తి సాధించడంతో ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యత, రక్షణ విషయంలో ఏరియాలోని అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డీఎం సుభాని, జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం(సీపీపీ)  మనోహర్  పాల్గొన్నారు.