
కోల్బెల్ట్, వెలుగు :బెల్లంపల్లి రీజియన్ పరిధిలో సింగరేణిలో పనిచేస్తున్న అధికారులకు సంబంధించిన కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. రీజియన్లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్ ఎస్టీపీపీ ఏరియాలకు చెందిన అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.రీజియన్ పరిధిలోని 545 మంది అధికారులకు 470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.86.24 శాతం పోలింగ్ నమోదైంది. మందమర్రి ఏరియాలో179 మంది అధికారులకు 150 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 217 మందికి 199, బెల్లంపల్లి ఏరియాలో 74 మందికి 54 , జైపూర్ ఎస్టీపీపీ ఏరియాలో 75 మందికి 67 మంది ఓటు వేశారు.
ఆదివారం సింగరేణికి సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నాటికే పోలింగ్ 80 శాతం నమోదైంది. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా రహస్య బ్యాలట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. అధికారులు ఉత్సాహంగా ఓటు వేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల బరిలో నిలిచిన అధికారులు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం కనిపించింది. సింగరేణి అధికారుల సంఘం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కార్పొరేట్ సీజీఎం(సేఫ్టీ) గురువయ్య ఆయా ఏరియాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, జైపూర్ ఎస్టీపీ ఏరియాల జీఎంలు మనోహర్, సంజీవరెడ్డి, రవిప్రసాద్, బసివి రెడ్డి ఏరియా ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. కాగా సింగరేణి వ్యాప్తంగా 2,174 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్, సింగరేణి స్థాయిలో ఆరుగురు చొప్పున 12 పోస్టులకు బరిలో నిలిచిన ప్రతిఒక్కరికి ఒక్కొక్క ఓటు వేయడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఎక్కువ సేపు ఉండాల్సి వచ్చింది.