జనగామ, వెలుగు : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ట్రాక్టర్లకు జీపీఎస్ అనుసంధానించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆఫీసర్లను ఆదేశించారు. చెన్నూరు రిజర్వాయర్ నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక మంజూరీ కోసం గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దేవరుప్పుల మండలం రంభోజీగూడెం వద్ద చెన్నూరు రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఇసుక కేటాయింపులకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా ను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ శ్రీనివాసరావు , ఇరిగేషన్ ఈఈ ప్రవీణ్ పాల్గొన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ధరణి పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 4357 పెండింగ్ దరఖాస్తులు ఉండగా వీటిలో జనగామ డివిజన్ లో 3173, స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కు సంబంధించినవి 1184 ఉన్నట్లు చెప్పారు. ఇందులో జనగామలో 2384, ఘన్ పూర్ లో 1059 దరఖాస్తులు పరిశీలన జరిగిందన్నారు. మిగిలిన 914 దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.