సోన్ మండలంలో వై జంక్షన్ సమస్యను వెంటనే పరిష్కరించండి : కలెక్టర్ అభిలాష అభినవ్ 

సోన్ మండలంలో వై జంక్షన్ సమస్యను వెంటనే పరిష్కరించండి : కలెక్టర్ అభిలాష అభినవ్ 
  • ఎన్ హెచ్ ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశం

నిర్మల్, వెలుగు: సోన్ మండలంలో కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి ‘వై’ జంక్షన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలంలోని కడ్తాల్ ప్రజలు పడుతున్న సమస్యలు పరిష్కరించేలా కలెక్టర్ గురువారం కలెక్టరేట్​లో సంబంధిత అధికారులు, కడ్తాల్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యని గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో ఇదివరకే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రమాదాలను అరికట్టేందుకు ఆర్డీవో అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని.. ఈ కమిటీ ఇప్పటికే సమస్యాత్మక ప్రదేశానికి వెళ్లి వాహనాల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించిందన్నారు.

రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని.. అప్పటివరకు ప్రమాదాలను నివారించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీలు రాజేశ్ మీనా, ఉపేంద్రారెడ్డి, ఆర్డివో రత్నకల్యాణి, ఆర్ అండ్ బీ ఈఈ అశోక్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ప్రసన్న, ఆర్టీవో దుర్గాప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.