
- జల శక్తి సమావేశంలో కలెక్టర్ అభిలాష
నిర్మల్, వెలుగు : జిల్లాలో భూజగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర జలశక్తి అభియాన్ డైరెక్టర్, నోడల్ అధికారి అనిత, జలశక్తి అభియాన్ సాంకేతిక అధికారి సుశాంత్ కుమార్ రాణాతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. భూగర్బ జలాల పెంపునకు, ‘నారీ శక్తీ సే జల్ శక్తి’ అనే ఇతివృత్తంతో భూగర్భ జలాలు సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు, సదర్మాట్ బ్యారేజీల ఆయకట్టు, సాగు విస్తీర్ణం తదితర అంశాలను కేంద్ర అధికారులకు వివరించారు. బోరు బావుల వద్ద నీటి లభ్యతను పెంచేందుకు రీఛార్జ్ శాఫ్ట్ అనే అధునాతన పద్ధతిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గుంతలు తవ్వి నీటిని ఒడిసిపడుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగు నీరు అందిస్తున్నట్లు వివరించారు.
సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో విజయ లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ సందీప్, భూగర్భ జలాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస బాబు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.