
వనపర్తి, వెలుగుః అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు పంపించాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్ల అనుమతి రద్దు చేసి ఇతరులకు ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో వ్యవసాయ, కో ఆపరేటివ్, సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులతో ధాన్యం తరలింపు పై రివ్యూ మీటింగ్నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. గోపాల్ పేట, పెద్ద మందడి, పొల్కేపాడు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తరలించేందుకు సిద్ధంగా ఉందని వడ్లు తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. మీటింగ్లో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి . రాణి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 80 ఫిర్యాదులు
ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం రెడ్ క్రాస్ ద్వారా రూపొందించిన యాంటీ డ్రగ్స్ అవగాహన గోడ పత్రికను అదనపు కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి విడుదల చేశారు.