
వనపర్తి, వెలుగు: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ‘బేటి బచావో– బేటి పడావో’ కార్యక్రమాన్ని ప్రారంభించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడంతో పాటు రక్తహీనత నుంచి విముక్తి కల్పించాలని, నాణ్యమైన విద్యను అందించాలన్నారు. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతో పాటు సహకరించే వారిపై, పెండ్లి చేసే అర్చకుడు, ఖాజీ, పాస్టర్లపై కేసులు నమోదు చేయాలన్నారు.
అవసరమైతే బైండోవర్ చేస్తారని హెచ్చరించారు. జిల్లాలో పురుషులు, మహిళల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ ఉమామహేశ్వర రావు, డీడబ్ల్యూవో సుధారాణి, డీసీపీవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.