
వనపర్తి, వెలుగు: పెండింగ్లో ఉన్న టీజీ ఐపాస్ ఆన్లైన్ అప్లికేషన్లను పరిశీలించి వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థికంగా ముందుకెళ్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు.
డీఐపీసీలో భాగంగా టీ ప్రైడ్ స్కీమ్ కింద ఆరుగురు ఎస్సీలకు, ఆరుగురు ఎస్టీలకు, ఒక దివ్యాంగుడికి సంబంధించిన ఇన్సెంటివ్స్ను మంజూరు చేశారు. ఇండస్ట్రీస్ జిల్లా జనరల్ మేనేజర్ జ్యోతి, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి 47 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
వంద శాతం సీఎంఆర్ ఇస్తేనే ధాన్యం..
వానాకాలం సీజన్ కు సంబంధించి వంద శాతం సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లకే వడ్లు కేటాయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. తన ఛాంబర్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సివిల్ సప్లై కార్పొరేషన్కు మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ పై పౌరసరఫరాల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023–-24 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ అందించేలా మిల్లర్లపై ఒత్తిడి తేవాలని సూచించారు.
గత సీజన్లలో వడ్లు తీసుకొని ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కేసులు నమోదు చేసి, ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలన్నారు. గత వానాకాలం సీజన్ కు సంబంధించి 59 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉందని, ఇక నుంచి100 శాతం సీఎంఆర్ ఇచ్చిన వారికే వడ్లు కేటాయించాలన్నారు. యాసంగి వడ్ల కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్వో కాశీ విశ్వనాథ్, డీఎం జగన్ పాల్గొన్నారు.