
పెబ్బేరు/ శ్రీరంగాపూర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందిన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం శ్రీరంగాపూర్ మండలంలోని నాగసానిపల్లి, పెబ్బేరు మండలంలోని ఈర్లదిన్నె గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. శ్రీరంగాపూర్ మండలం నాగసాని పల్లిలో 156 మంది, పెబ్బేరు మండలం ఈర్లదిన్నె గ్రామంలో 72 మంది లబ్ధిదారులు గ్రామ సభల ద్వారా ఎంపిక కాగా బుధవారం లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
నాగసానిపల్లి గ్రామంలో గోవిందమ్మ ఇంటి స్థలాన్ని, ఈర్లదిన్నె గ్రామంలో వరలక్ష్మమ్మ ఇంటి స్థలాన్ని పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో పంచాయతీ సెక్రటరీ ఫొటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాలని, ఇళ్లు కట్టుకునే వారు స్థానిక పంచాయతీ సెక్రటరీకి సమాచారం ఇచ్చి నిర్మాణం ప్రారంభించుకోవాలని సూచించారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత దశలవారీగా నగదు అందుతుందని చెప్పారు. అనుమతుల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
అన్ని మండల కేంద్రాల్లో రూ.5 లక్షలతో నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నామని , దానిని చూసి రూ.5 లక్షల లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇసుక కోసం ఆందోళన చెందవద్దని, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరించుకొని తహసీల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చని వివరించారు. సమావేశంలో శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల తహసీల్దార్లు మురళి, లక్ష్మి, పెబ్బేరు ఎంపీడీవో రవీంద్ర, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.