
మహబూబాబాద్/ గ్రేటర్వరంగల్/ తొర్రూరు/ జనగామ అర్బన్/ ములుగు, వెలుగు: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మహిళా ఉద్యోగులను సన్మానించారు. పెద్ద వంగర మండలం చిట్యాల స్కూల్లో మహిళా టీచర్లను హెచ్ఎం విజయ్కుమార్ ఆధ్వర్యంలో సన్మానించారు.
నుమకొండలోని కన్వెన్షనల్ హాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ అశ్వినితానాజీ వాకాడే పాల్గొని మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ శానిటేషన్ విభాగంలో మహిళా సిబ్బందే ఎక్కువగా ఉన్నారని, నగరాన్ని శుభ్రం చేయడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నారని కొనియాడారు.
1 లక్ష 15 వేల మంది మహిళలు ఎస్ హెచ్ జీ బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, వారి ఆర్థిక పరిపుష్టి అందించడానికి ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా లోన్లను అందిస్తోందని చెప్పారు. అనంతరం జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి మన్సూర అసీబా ను కమిషనర్ బ్యాంకు ప్రతినిధులు శాలువాతో సన్మానించారు.
మహిళా దినోత్సవాల్లో భాగంగా జనగామ కలెక్టరేట్లోని మహిళా సాధికారిక కేంద్రం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ములుగులోని సెయింట్ ఆంథోనీస్, బిట్స్ హై స్కూల్, బ్రిలియంట్, సన్ రైజర్స్, అరవింద పాఠశాలల్లో విద్యార్థుల తల్లులకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.