ఇంటర్​ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

ఇంటర్​ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

కామారెడ్డిటౌన్, వెలుగు:  ఇంటర్మీడియట్​ ప్రాక్టికల్​, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌‌లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.   ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు 48 సెంటర్లలో ప్రాక్టికల్​ పరీక్షలు,  మార్చి 5 నుంచి 25 వరకు  థియరీ పరీక్షలు జరుగుతామన్నారు.   పరీక్షల సమయంలో కరెంట్ సప్లయ్​లో అంతరాయం లేకుండా  చూడాలన్నారు.  

గ్రామాల నుంచి స్టూడెంట్స్​ సకాలంలో వచ్చేలా బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్​వి. విక్టర్, ఇంటర్​నోడల్​అధికారి షేక్​సలాం, డీపీవో శ్రీనివాస్​రావు, డీఈవో రాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సంబురంగా  ప్రభుత్వ జూనియర్ కాలేజీ వార్షికోత్సవం

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి  ఎదగాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.   మంగళవారం జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కాలేజీ వార్షికోత్సవ ప్రోగ్రాంకు కలెక్టర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నాయన్నారు.   ఇంటర్మీడియట్ అనంతరం  ఉన్నత విద్య కోసం మంచి ఆలోచనలతో  కోర్సులను ఎంపిక చేసుకోవాలన్నారు.  ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా సాగాలన్నారు.  

జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో  జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు  చర్యలు తీసుకుంటానన్నారు.  ఆన్​లైన్​ ద్వారా అనుభవజ్ఞులైన లెక్చరర్లతో కోచింగ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  ఇంటర్​ నోడల్​ అధికారి షేక్​సలాం, కాలేజీ ప్రిన్సిపాల్​జయకుమారి, దాతలు డాక్టర్​ జి. రవీందర్​రెడ్డి, డాక్టర్​ అర్వింద్​, డాక్టర్​ కృప, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు అందజేశారు.