రైతులకు ఉచిత న్యాయ సాయం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

రైతులకు ఉచిత న్యాయ సాయం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : భూభారతితో రైతులకు ఉచిత న్యాయ సాయం అందుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సుల్లో కలెక్టర్​ మాట్లాడారు.  గతంలో ధరణిలో అప్పీలుకు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ‘భూభారతి’తో అప్పీలుకు అవకాశం ఉందన్నారు.  లైసెన్స్​ సర్వేయర్​తో భూ సర్వే చేయించి మ్యాప్ తయారు చేయించుకుంటే పాస్​బుక్​లో ఎంట్రీ చేస్తారన్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే,  ఎంక్వైరీ చేసి నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకుంటామన్నారు. పంట పొలాల్లో  ఫామ్ పాండ్స్,  ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వుకోవాలని రైతులకు సూచించారు. ఉపాధి హామీ స్కీం కింద ఈ పనులు చేపట్టవచ్చన్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో వీణ, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు. 

వడ్ల కొనుగోళ్లు స్పీడప్​ చేయాలి 

వడ్ల కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.  టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.  తాగునీటి సౌకర్యం, నీడ వసతి కల్పించాలన్నారు.  ఇందిరమ్మ ఇంటి సర్వేను కలెక్టర్​ పరిశీలించారు.  అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు.  డీఎస్​వో మల్లికార్జున్, డీఎం రాజేందర్,   డీసీవో రామ్​మోహన్,  స్పెషల్​ అధికారి జ్యోతి ఉన్నారు.   

అంబలి, చలి వేంద్రం ప్రారంభం 

కామారెడ్డి కలెక్టరేట్​లో టీఎన్జీవో  జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలి వేంద్రాన్ని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ శనివారం  ప్రారంభించారు.  అడిషనల్ కలెక్టర్​ చందర్​నాయక్​, టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్ నరాల వెంకట్​రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం.నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, సాయిలు, శ్రావణ్,  చక్రదర్,  లక్ష్మణ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.     

మే 6న జాబ్​మేళా 

హెచ్​సీఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో టెక్​ బీ పోగ్రాం కోసం మే 6న కామారెడ్డి గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలోని ఆడిటోరియంలో మెగా జాబ్​ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.  2024, 2025లో ఇంటర్ కంప్లీట్ చేసిన  ఎంపీసీ, ఎంఈసీ,  సీఈసీ, బీపీసీ, ఒకేషనల్​ కంప్యూటర్ విద్యార్థుల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  ఎస్సెస్సీ సర్టిఫికెట్,  ఇంటర్​ సర్టిఫికెట్,  ఆధార్ కార్డు, ఆండ్రాయిడ్ మొబైల్​ ఫోన్​ తో హాజరుకావాలని తెలిపారు.