
కామారెడ్డిటౌన్, వెలుగు : గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్ లో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కేంద్రాన్ని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డిలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి, జిల్లా మొదటి స్థానంలో నిలుపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఎంఈవోలు, హైస్కూల్ హెచ్ఎంలు, మోడల్ స్కూల్స్, కేజీవీబీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈవో రాజు, ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ బలరాం, డీసీఈబీ సెక్రటరీ నీలం లింగం, కో ఆర్డినేటర్లు వేణుగోపాల్, నాగవేందర్, వెంకటరమణారావు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
మెనూను పక్కాగా అమలు పర్చాలి ..
హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన డైట్ మెనూను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ మీటింగ్లో ఆయన మాట్లాడారు. తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. పప్పులు, ఇతర ఆహార పదార్థాలు కాంట్రాక్టర్లు నాణ్యమైనవి సప్లయ్ చేసేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు రజిత, స్రవంతి, దయానంద్, ఫుడ్ సేప్టీ అధికారి శిరిష పాల్గొన్నారు.