
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ఎగ్జామ్స్ 61 కేంద్రాల్లో జరుగనున్నాయని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గురువారం నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయని చెప్పారు. ఈనెల15 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారు. ఫస్ట్ ఇయర్లో 2,433 మంది, సెకండ్ ఇయర్లో 5,893 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కు అటెండ్ కానున్నారని తెలిపారు.
సెకండ్ ఇయర్ ఒకేషనల్ స్టూడెంట్స్ 1,935 మంది హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. కమిటీలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సులోచనా రాణి, మణుగూరు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్డీ యూసుఫ్, అశ్వాపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ సుధాకర్రెడ్డి ఉన్నారని తెలిపారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు పర్యావరణ పరీక్షను ఈ నెల 19న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎగ్జామ్స్ అంటే ఒత్తిడి లేకుండా రాష్ట్ర స్థాయిలో 14416 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టూడెంట్స్కు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపాలని కోరారు. కరెంట్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు.
సర్పంచ్ల పదవీ కాలం ముగింపు
సర్పంచ్ల పదవీ కాలం గురువారం సాయంత్రం 5గంటల లోపు ముగుస్తుందని కలెక్టర్తెలిపారు. సర్పంచ్ల వద్ద డిజిటల్ కీతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంపీవోలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నామన్నారు.