
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
మిర్యాలగూడ, వెలుగు : రుతుక్రమంపై బాలికలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సూచించారు. బుధవారం మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ భాగంగా కిశోర బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ బాలికలు తమ లక్ష్యాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తగిన పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్ తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని చెప్పారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం డీడబ్ల్యూవో కృష్ణవేణి మాట్లాడుతూ కిశోర బాలికలు రుతుక్రమం సమయంలో పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాల గురించి వివరించారు.
ఇసుక సరఫరాపై నిఘా పెట్టాలి
నల్గొండ అర్బన్, వెలుగు : వంగమర్తి, ఇటుకల పహాడ్ రీచ్ ల నుంచి సరఫరా చేసే ఇసుకపై నిఘా పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం వంగమర్తి, ఇటుకల పహాడ్ పరిధిలో ఇసుక రీచ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంగమర్తి, ఇటుకల పహాడ్ రీచ్ ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలు, వే బ్రిడ్జి, ఇసుకను లోడ్ చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.