
- కలెక్టర్ జితేశ్.వి. పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(న్యాక్) ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీలకు సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ఇండ్ల నిర్మాణాల్లో మేస్త్రీలదే కీలక పాత్ర అని అన్నారు. ఇంటి సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకునేలా మేస్త్రీలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పటిష్టంగా ఉండే విధంగా నిర్మించాలన్నారు. . ప్రభుత్వం అందజేసే రూ. 5 లక్షలతో క్వాలిటీతో ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.
మొదటి విడతలో బేస్ మెంట్ పూర్తి అయిన తర్వాత రూ. లక్ష, రెండో విడతలో గోడలు పూర్తి అయిన తర్వాత రూ. 1.25 లక్షలు, మూడో విడతలో స్లాబ్ పూర్తి అయిన తర్వాత రూ.1.75లక్షలు నాలుగు విడతలో ఇల్లు పూర్తి అయిన తర్వాత మిగిలిన రూ. లక్ష సాంక్షన్ అవుతాయన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ శిక్షణను మేస్త్రీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేస్త్రీలకు టీ షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రాంలో హౌసింగ్ పీడీ శంకర్, మెప్మా పీడీ రాజేశ్, న్యాక్ అధికారి హెప్సిబా, ఇన్స్ పెక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాంల తనిఖీ
కొత్తగూడెంలోని ఈవీఎంల గోదాంలను కలెక్టర్తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం గోదాంలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెలా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సూపరింటెండెంట్ ధారా ప్రసాద్, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల మాస్టర్ ట్రైనీ పూసపాటి సాయి కృష్ణ ఉన్నారు.