వరదలతో అలర్ట్ గా​ ఉండాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్

వరదలతో అలర్ట్ గా​ ఉండాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్
  •  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​         
  •  భద్రాచలంలో పర్యటన.. పలు పనుల పరిశీలన

భద్రాచలం, వెలుగు : తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదల పట్ల అలర్ట్​గా ఉండాలని కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలో ఆయన పర్యటించారు. తొలుత విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. చిన్న పాటి వర్షాలకే పలు కాలనీల్లోకి వరద నీరు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్లూయిజ్​ల వద్ద పంపింగ్​ మోటార్లను తనిఖీ చేశారు. మోటార్లతో నీటిని ఎత్తిపోయాలని, అవసరమైతే అడిషనల్​గా కొన్ని మోటార్లను రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పారు.

గోదావరి తీర ప్రాంతంలోని మండలాల సెక్టోరియల్​ ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. గోదావరి పెరిగితే ఫ్లడ్​ రిలీఫ్​ సెంటర్లకు నిర్వాసితులను తరలించేందుకు యాక్షన్​ ప్లాన్​ తయారు చేసుకోవాలని సూచించారు. ఫ్లడ్​ రిలీఫ్​ సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా లోకల్​ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. భద్రాచలం పట్టణంలో డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్టను తనిఖీ చేశారు. ఇరిగేషన్​ ఈఈ రాంప్రసాద్​తో పాటు, కాంట్రాక్టు ప్రతినిధులతో పనుల పురోగతిపై రివ్యూ చేశారు.

వరదలు పెరగక ముందే పనులు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. మనుబోతుల చెరువు వద్ద నిర్మించిన నూతన డంపింగ్​ యార్డును చూశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్​యార్డుకు తరలించాలని, ఈ విధానాన్ని రోజూ వార్డుల్లో ఈవో, సెక్రటరీలు తనిఖీలు చేయాలని  ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా చూసే బాధ్యత పంచాయతీలదేనని స్పష్టం చేశారు. కలెక్టర్​ వెంట ఇరిగేషన్​ ఈఈ రాంప్రసాద్, తహసీల్దార్​ శ్రీనివాసరావు, ఆర్​ఐ నర్సింహారావు తదితరులు ఉన్నారు.