భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ప్లాన్ చేయండి​ : కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా ప్లాన్ చేయండి​ : కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​
  • జిల్లాలో1.84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పక్కాగా చేపట్టేలా ఆఫీసర్లు ప్లాన్​ చేయాలని కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో పౌరసరఫరాల సంస్థ, డీఆర్​డీఏ, అగ్రికల్చర్, సహకార, తూనికలు.. కొలతలు, ట్రాన్స్​పోర్టు, మార్కెటింగ్​శాఖల జిల్లా ఆఫీసర్లు, రైస్​ మిల్లర్లతో గురువారం నిర్వహించిన మీటింగ్​లో ఆఫీసర్లతో కలిసి మద్దతు ధర వివరాలతో కూడిన వాల్​ పోస్టర్లను కలెక్టర్​ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,84,502 మెట్రిల్​ టన్నుల ధాన్యం  సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 99,729 మెట్రిల్​ టన్నులు సన్న బియ్యమని తెలిపారు. జిల్లాలో 144 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.  కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

అగ్రికల్చర్​ ఆఫీసర్లు చేసిన క్రాప్​ బుకింగ్​ ప్రకారంగా రైతులకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా ఎనిమిది చెక్​ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దిగుమతిలో జాప్యం చేయకుండా మిల్లర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

గన్నీ సంచులు తీసుకున్న రైతుల వివరాలను రిజిష్టర్​లో నమోదు చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద సన్న వడ్లు, దొడ్డు వడ్లకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, పలు శాఖలకు చెందిన జిల్లా ఆఫీసర్లు త్రినాధ్​, రుక్మిణి, కుర్షిద్​, బాబూరావు, విజయ్​ కుమార్, మనోహర్, నరేందర్​ పాల్గొన్నారు. 

రాజీవ్​యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి

రాజీవ్​యువ వికాసానికి అర్హులైన నిరుద్యోగులు ఏప్రిల్​ 5 లోపు వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్​ జితేశ్​ ఒక ప్రకటనలో తెలిపారు. 21 ఏండ్ల నుంచి 55 ఏండ్ల వయసు వరకు గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ. 2లక్షల లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు.