తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కరెంట్​ సప్లై, తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్​ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో బుధవారం కలెక్టర్​టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఎన్నికల కోడ్​ అమలులో ఉండడంతో కొత్త రేషన్​ కార్డులను పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. తాగునీటి అవసరాలకు సరిపడా వాటర్​ అందుబాటులో ఉందని, సప్లైలో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. పంటలకు సాగు నీరు అందేలా ఇరిగేషన్​ ఆఫీసర్లు తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. నిరంతరం కరెంట్​ సప్లై ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

విద్యతోనే మంచి భవిష్యత్​

విద్యతోనే మంచి భవిష్యత్​లభిస్తుందని కలెక్టర్​విద్యార్థులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని జడ్పీహెచ్​ఎస్​ను ఆయన సందర్శించారు. స్టూడెంట్స్​ టెన్త్​ క్లాస్​లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని టీచర్లు సూచించారు. సైన్స్​ ల్యాబ్​, రేకుల షెడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అందజేయాలని ఆదేశించారు. 

క్రీడలతో మానసికోల్లాసం

అశ్వారావుపేట : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి దోహదపడతాయని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​వి పాటిల్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బోధన సిబ్బంది జోనల్ క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధన సిబ్బంది వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు సాగు చేస్తున్న మునగ పంటను పరిశీలించారు.