
సిద్దిపేట రూరల్, వెలుగు: సంక్షేమ హాస్టల్స్లో బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలోని ఉన్న షెడ్యూల్ కులాల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల డార్మెటరీ, కిచెన్రూమ్స్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరుకుల సరఫరాలో ఇబ్బంది ఉంటే చెప్పాలన్నారు. వంట పాత్రల కొరత ఉంటే వాటి కొనుగోలుకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ఇన్చార్జి ఎస్సీ అభివృద్ధి శాఖ ఆఫీసర్హామీద్ ను ఆదేశించారు. బాత్రూంలకు సరిగా డోర్స్ లేకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాధవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ మొదటి వారంలోగా ఫ్యాక్టరీని ప్రారంభించాలి
పెండింగ్ లో పనులు త్వరగా కంప్లీట్ చేసి జూన్ మొదటి వారంలోగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఆయిల్ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సైట్ మేనేజర్లను కలెక్టర్ ఆదేశించారు. నంగునూరు మండలంలోని నర్మెట్టలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట హార్టికల్చర్ అధికారి సువర్ణ, ఉద్యాన శాఖ అధికారులు, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో లక్ష్మప్ప ఉన్నారు.