
సిద్దిపేట, వెలుగు: స్వయం సహాయక సంఘాల మహిళలను బలోపేతం చేయడానికి ఇన్నోవేషన్ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం మండలంలోని సముద్రాలలో 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని కొన్ని స్టార్టప్ కంపెనీలు ఇన్నోవేషన్ పార్కులో పలు యూనిట్లను స్థాపించి మహిళలకి ఉపాధి అందిస్తారని తెలిపారు.
ఈ పార్క్ నిర్మాణ పనులు ఐటీ హబ్ ఆవేశ సస్టేనబిలిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. ఈ పార్క్ లో జ్యూట్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ వేస్ట్ తో టైల్స్, ఇటుకల తయారీ, ప్లాస్టిక్ రహిత వాటర్ బాటిల్ తయారీతో మహిళలకి ఉపాధి కల్పిస్తారన్నారు. ఈ పార్క్ కు విద్యుత్ అందించేందుకు ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి కనెక్షన్ ఇవ్వాలని ట్రాన్స్కో ఏఈ ని ఆదేశించారు.
నీటి కోసం బోరు బావులు తవ్వించాలన్నారు. చుట్టూ కాంపౌండ్ నిర్మాణం పూర్తి కాగానే భూమి పూజ చేసి పార్క్ పనులు ప్రారంభించాలని సూచించారు. భూ సమస్యలు ఎదురైతే రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్, డీపీఎం కర్ణాకర్, ఆవేశ సస్టేనబిలిటీ ఫౌండేషన్ ప్రతినిధి అక్షయ్, తహసీల్దార్ సురేఖ, ఏపీఎం తిరుపతి ఉన్నారు