
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వ ఉద్యోగులపై రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది ప్రభుత్వ అధికారుల జీతాన్ని కలెక్టర్ నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆగస్టు నెల జీతాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా ట్రెజరీ అధికారిని ఆదేశించారు. జీతాలు నిలిపివేసిన ఉద్యోగుల్లో కాశీపూర్ తహసీల్దార్ కూడా ఉన్నారు. డ్యూటీ చేయాల్సి ఉండగా.. వారు గైర్హాజర్ అయినట్లు కలెక్టర్ గుర్తించారు. ప్రభుత్వం పేదలకు భూ పట్టాలు పంపిణీ సమయంలో వీరంతా విధులకు హాజరు కాలేదని తేలింది.
కాశీపూర్ బ్లాక్ పరిధిలోని భూమి లేని గిరిజనులకు భూమి కేటాయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భూముల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగినట్లు స్థానికంగా ఉన్న గిరిజనులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాన్ని స్వయంగా సందర్శించారు. కార్యాలయంలో పలు అవకతవకలు గుర్తించిన ఆమె పౌరులకు సేవలు అందడం లేదని తెలుసుకున్నారు. దీంతో జీతాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.