రైతు భరోసాను పంటరుణాలకు జమ చేయొద్దు : జితేశ్​ వి పాటిల్​

రైతు భరోసాను పంటరుణాలకు జమ చేయొద్దు : జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధులను పంట రుణాల కింద జమ చేయొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ బ్యాంకర్లకు  సూచించారు.  కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లు, బ్యాంకర్లతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల వారీగా కలెక్టర్​ సమీక్షించారు. రుణ ప్రణాళిక బుక్​లను ఆవిష్కరించారు. హెచ్​డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రుణాలను రైతులకు ఇవ్వడంలో చాలా పూర్​గా ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,710 కోట్ల క్రాప్​ లోన్లకు గానూ మార్చి చివరి నాటికి రూ. 1,400.24కోట్ల అందించినట్లు తెలిపారు. 

తమ రుణాలను రెన్యూవల్​ చేసుకునే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పెండింగ్​లో ఉన్న రుణాల ప్రతిపాదనలను బ్యాంకర్లకు అందించి, త్వరగా శాంక్షన్​ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7,344కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించామని చెప్పారు. రూ.3,418.94కోట్లతో క్రాప్​ లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వశక్తి సంఘాలకు సంబంధించి రుణాల రికవరిపై దృష్టి పెట్టాలని సూచించారు. 

లోన్లు ఇవ్వడంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కూరగాయల సాగు, నర్సరీలు, కోల్డ్​ స్టోరేజ్​ల ఏర్పాటుతోపాటు వ్యవసాయ పనిముట్లకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసర్​ విద్యాచందన, లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ రాంరెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులు సంజీవరావు, సూర్యనారాయణ, రవి బ్యాంక్​ అధికారులు పృథ్వీ, సుజిత్​ కుమార్, నాబార్డ్​ అధికారులు ​పాల్గొన్నారు.