పొద్దు పొద్దున్నే స్టూడెంట్​ ఇంటికి కలెక్టర్.. విద్యార్థికి సడెన్ సర్​ప్రైజ్

పొద్దు పొద్దున్నే స్టూడెంట్​ ఇంటికి కలెక్టర్.. విద్యార్థికి సడెన్ సర్​ప్రైజ్
  • పొద్దు పొద్దున్నే స్టూడెంట్​ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ 
  • తనను తాను కలెక్టర్​గా పరిచయం చేసుకొని.. అండగా ఉంటానని భరోసా
  • టెన్త్​ ఎగ్జామ్స్​ ముగిసేవరకు నెలకు రూ. 5 వేలు సాయం చేస్తానని ప్రకటన
  • ఉన్నత చదువులకు కూడా తోడ్పాటునందిస్తానని హామీ

యాదాద్రి, వెలుగు: ఓ టెన్త్​ క్లాస్​ స్టూడెంట్‎ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​హనుమంతరావు సర్​ప్రైజ్ చేశారు. పొద్దు పొద్దున్నే  ఆ స్టూడెంట్​ఇంటి తలుపు తట్టిన ఆయన.. తనను తాను కలెక్టర్‎గా పరిచయం చేసుకున్నారు. చదువులో రాణించాలని, తాను అండగా ఉంటానని ఆ పేదింటి విద్యార్థికి భరోసా ఇచ్చారు. అనంతరం సత్వర సాయంగా కొంత డబ్బు అందజేశారు. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్​ హనుమంతరావు.. జిల్లాలోని ఆఫీసర్లు అందరూ హాస్టల్​నిద్ర చేయాలని ఇటీవల ఆదేశించారు. చదువులో వీక్‎గా ఉన్న స్టూడెంట్లతో మాట్లాడాలన్నారు.


బుధవారం రాత్రి ఒక్కో ఆఫీసర్​ఒక్కో హాస్టల్‎లో నిద్ర చేయగా.. కలెక్టర్​ హనుమంతరావు సంస్థాన్​నారాయణపురంలోని ఎస్సీ హాస్టల్‎లో నిద్రించారు. ఈ సందర్భంగా డీఈవో నుంచి.. స్టడీలో వీక్‎గా ఉన్న టెన్త్​ క్లాస్​స్టూడెంట్ల లిస్ట్​తీసుకొని పరిశీలించారు. కంకణాలగూడెం గ్రామానికి చెందిన భరత్​చంద్రచారిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు గ్రామానికి చేరుకొని.. భరత్​ చంద్రచారి ఇంటి తలుపును కలెక్టర్​తట్టారు. తలుపు తీసిన భరత్ తల్లి విజయలక్ష్మికి తనను తాను కలెక్టర్‎గా పరిచయం చేసుకోవడంతో ఆమె ఆశ్చర్యపోయారు. 

అప్పుడే అక్కడికి చేరుకున్న భరత్​చంద్రచారితోనూ కలెక్టర్​మాట్లాడారు. ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. ‘‘మీ అమ్మ కష్టపడి చదివిస్తున్నది. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి’’ అని ఆ బాబుకు సూచించారు. భవిష్యత్తులో ఏమవుతావని కలెక్టర్ ప్రశ్నించగా.. పోలీస్ ఆఫీసర్ అవుతానంటా భరత్​ సమాధానం ఇచ్చాడు. ఆ బాబుకు కూర్చొని చదవడానికి వీలుగా చైర్, రాసుకోవడానికి రైటింగ్ పాడ్‎ను కలెక్టర్​అందజేశారు. 

అనంతరం కుటుంబ పరిస్థితిని ఆరా తీశారు. భరత్ తండ్రి కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. తల్లికి అనారోగ్యం. చెల్లికి మానసికస్థితి సరిగ్గా లేదు. రూ. 2 వేల పింఛన్​ ఒక్కటే ఆ కుటుంబానికి ఆధారమని తెలుసుకున్న కలెక్టర్.. చదువుల కోసం భరత్‎ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టెన్త్ పరీక్షలు ముగిసే వరకు నెలకు రూ. 5 వేల చొప్పున అందజేస్తానన్నారు. ఫిబ్రవరికి సంబంధించిన రూ.5 వేలు ఇచ్చారు. పాలిటెక్నిక్​ఎంట్రన్స్​రాయిస్తానన్నారు. భరత్​ స్థిరపడే వరకు సహకారం అందిస్తానని కలెక్టర్​హనుమంతరావు హామీ ఇచ్చారు. దీంతో ఆ పేదింటి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.