
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 15 జిల్లాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల(కలెక్టర్లు)తో శనివారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 15 జిల్లాల పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల రిసిప్షన్ సెంటర్ అంబేద్కర్ స్టేడియంలో ఉంటుందని, అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి పంపించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్లను భారీ బందోబస్తు మధ్య పంపించాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా పోలైన బ్యాలెట్ బాక్సులను డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో ఉంచాలని, కౌంటింగ్ రోజు ఉదయం వాటిని కరీంనగర్ లోని కౌంటింగ్ సెంటర్ కు తరలించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే కంట్రోల్ రూం స్పెషల్ ఆఫీసర్ ను సంప్రదించాలని సూచించారు. కరీంనగర్ నుంచి పంపిణీ అవుతున్న పోలింగ్ మెటీరియల్ను క్షుణ్ణంగా పరిశీలించాన్నారు.
గ్రాడ్యుయేట్లు 3,55,159, టీచర్ ఎమ్మెల్సీకి 27,088 మంది ఓటర్లు
ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులతో కలెక్టరేట్లో కలెక్టర్ పమేలాసత్పతి సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. 394 మంది మైక్రో అబ్జర్వర్లు, 335 మంది జోనల్ అధికారులు, 2,606 మంది పోలింగ్ ఆఫీసర్లు, 864 మంది ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,55,159మంది, టీచర్స్ ఓటర్లు 27,0 88 మంది ఉన్నట్లు తెలిపారు.
పోలింగ్ స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందన్నారు. గ్రాడ్యుయేట్లకు 406, టీచర్లకు 181 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయగా.. కామన్ పోలింగ్ స్టేషన్లు 93 ఉన్నట్లు వివరించారు. పోలింగ్కు 48 గంటల ముందు సమావేశాలు, ప్రచారం నిలిపివేయాలని అభ్యర్థులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, పవన్ కుమార్ పాల్గొన్నారు.