
జమ్మికుంట, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, భూమి ఉన్న ప్రతి రైతుకు భూభారతి కార్డు ఇవ్వనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిలోని కీలక అంశాలను రైతులకు వివరించారు.
అనంతరం ఇల్లందకుంటలోని వడ్ల కొనుగోలు సెంటర్ను పరిశీలించారు. ఆ తర్వాత జడ్పీహైస్కూల్లో ఏర్పాటు చేసిన శుక్రవారం సభ ఆరోగ్య మహిళ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న, ఆర్డీవో రమేశ్బాబు, డీఎంహెచ్వో వెంకటరమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, తహసీల్దార్లు రమేశ్, రాణి, ప్యాక్స్ వైస్ చైర్మన్ కొమురెల్లి, పాల్గొన్నారు.
చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి
కరీంనగర్ టౌన్,వెలుగు: పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న 6 నెలల శిశువును మహారాష్ట్ర పుణేకు చెందిన దంపతులకు కలెక్టర్ చేతులమీదుగా దత్తత ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న
విద్యార్థులకు సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ప్రైవేట్ సంస్థల కరస్పాండెంట్లతో మాట్లాడారు. ఈనెల 28 నుంచి 20 రోజులపాటు నిర్వహించే సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో జనార్ధన్రావు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.