
తిమ్మాపూర్, వెలుగు: తాగునీటి కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని కలెక్టర్ పమేలా సత్పతి ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షం నీటి చుక్కను ఒడిసి పట్టి, నీటి వృథాను అరికట్టాలన్నారు.
నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా మరిన్ని చెక్ డ్యాంలు, ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్ఈ కే రాములు, ఈఈ అంజన్ రావు, రామ్ కుమార్ పాల్గొన్నారు.
మాల్ ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దు
కరీంనగర్ టౌన్, వెలుగు: పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం సిటీలోని ముఖరంపుర ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్, వాణినికేతన్ స్కూల్, మంకమ్మతోటలోని ధన్గర్వాడీ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన టెన్త్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు.