
కరీంనగర్ టౌన్, వెలుగు : త్వరలో జరగనున్న ఇంటర్మీడియల్, పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్వశ్చన్ పేపర్లను సెంటర్లకు తరలించే క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు.
డీఐఈవో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని, ఫస్ట్ ఇయర్ లో 17,799 మంది, సెకండియర్లో 17,763 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 58 సెంటర్లలో పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. డీఈవో జనార్దన్ రావు మాట్లాడుతూ మార్చి21 నుంచి ఏప్రిల్ 4వరకు 10వ తరగతి పరీక్షలకు 12,516 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో వెంకటరమణ, ఆర్టీసీ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ ఆధార్ అప్లికేషన్లను పరిష్కరించాలి
జిల్లాలోని 18 ఏండ్లు దాటిన వ్యక్తులకు సంబంధించి తహసీల్దార్ లాగిన్లలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. బుధవారం యూఐడీఏఐ డైరెక్టర్ చైతన్యరెడ్డి వర్చువల్గా నిర్వహించిన జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొన్నారు. స్టూడెంట్ల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేసేందుకు స్కూళ్లల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.