
మెదక్ టౌన్, వెలుగు : హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్కలెక్టర్ ఆఫీసులో అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2024 సంవత్సరంలో 27 లక్షలు, 2025 లో 25 లక్షలు, 2026లో 25 లక్షలు మొక్కల లక్ష్యం నిర్ణయించారన్నారు. ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం జీపీల డెవలప్మెంట్కు ప్రణాళికలు(జీపీడీపీ) తయారు చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి సరిపోయే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామ ప్రణాళికలు మూడు విధానాల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో తయారు చేయాలన్నారు. జనవరి 27వ తేదీలోగా తయారు చేసి జనవరి 31 వరకు ఈ-గ్రామ్ స్వరాజ్ యాప్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో వెంకట శైలేష్, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్, డీఎఫ్వో రవిప్రసాద్, డీపీవో సాయిబాబా, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం
ఈనెల 20 ,21 వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఆఫీసులో ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం గురించి గ్రామాల్లో చాటింపు వేసి ప్రచారం చేయాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు, జీపీ కార్యదర్శి, సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఓటరు గా నమోదు చేసుకున్న వారు చిరునామా, ఫొటో మార్పులు చేసుకోవచ్చన్నారు. మరణించిన వారి వివరాలు రికార్డు చేయాలని సూచించారు.స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, డీఎఫ్వో రవి ప్రసాద్, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.