ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, తాను చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం వల్ల కలెక్టర్ను అయ్యానని ఆదిలాబాద్ పాలనాధికారి రాజర్షి షా అన్నారు. నేషనల్ బుక్ట్రస్ట్ నిర్వహిస్తున్న మొబైల్ లైబ్రరీ వాహనాన్ని బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో కలెక్టర్ ప్రారంభించారు. అమ్మా నాన్నలు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులను పొదుపు చేసి పుస్తకాలు కొనుగోలు చేసి చదివే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
సంచార పుస్తక ప్రదర్శన వాహనం జిల్లాలో నాలుగు రోజులు వివిధ స్కూళ్లను సందర్శిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకునేలా హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇదే స్కూల్లో పుస్తకమిత్ర సంస్థ అందించిన రూ.40 వేల విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో టి.ప్రణీత, ఎంఈవో సోమయ్య, హెచ్ఎం కె.రమేశ్రెడ్డి, నేషనల్ బుక్ ట్రస్ట్ కోఆర్డీనేటర్స్ అశోక్, దేవ్ రావు, సెక్టోరల్ అధికారి సుజాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.