
పాపన్నపేట, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శనివారం మండలంలోని మల్లంపేట పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఈ నెల 30 చివరి తేది అన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూతుకు రాలేనివారు పోస్టల్ బ్యాలెట్లు పొంద వచ్చన్నారు. మండలంలోని మొత్తం పోలింగ్ బూత్లను సిబ్బందితో కలసి పరిశీలించాలని తహసీల్దార్లక్ష్మణ్ బాబును ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, మల్లంపేట సర్పంచ్ బాపురెడ్డి ఉన్నారు.
సూపర్వైజర్ సస్పెన్షన్
పాపన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్, ఎన్నికల సూపర్వైజర్ రాధా కృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్డీవో ను ఆదేశించారు. గ్రామంలో చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో తొలగించనందుకు, బీఎల్డీలను సమన్వయం చేయడంలో విఫలమైనందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.