
- మెదక్ కలెక్టర్ రాజర్షిషా
మెదక్, వెలుగు : ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున గృహలక్ష్మి, తదితర పథకాలకు సంబంధించి కొత్త ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. చీరల పంపిణీ, చెక్కుల పంపిణీ ఆఫీసర్ల ద్వారా జరగాలి తప్ప, ప్రజాప్రతినిధులు పంపిణీ చేయొద్దన్నారు. గవర్నమెంట్ అమలు చేసే స్కీంలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలన్నారు. ఎక్కడైనా బిల్డింగ్ ఓనర్ అనుమతి ఇస్తే బ్యానర్, పోస్టర్ పెట్టుకోవచ్చని ఆ ఖర్చు సంబంధిత అభ్యర్థి ఎన్నికల ఖర్చు కిందకు వస్తుందన్నారు.
పబ్లిషర్స్, ప్రింటర్స్ ఎలక్షన్కు సంబంధించి పార్టీల పాంప్లెంట్స్, పోస్టర్స్, ప్లకార్డులు ప్రింట్ చేస్తే కచ్చితంగా వాటిమీద ప్రింటర్ పేరు, అడ్రస్ ఉండాలని స్పష్టం చేశారు. లేనట్టయితే సెక్షన్ 127 ఏ ప్రకారం శిక్ష, జరిమానా పడుతుందని హెచ్చరించారు. ఫాం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫాం-8 ద్వారా అడ్రస్ మార్పునకు నామినేషన్ చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు.
నాలుగు ఫ్లయింగ్ స్వ్కాడ్ టీంలు, రెండు విజిలెన్స్సర్వలెన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కంట్రోల్ రూమ్, సీ - విజిల్ కంట్రోల్ రూమ్, మీడియా కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఐదు చెక్ పోస్టులు
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఐదు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. 161 నేషనల్ హైవే, పెద్దశంకరంపేట టోల్ గేట్, 44 నేషనల్ హైవే, తూప్రాన్ టోల్ గేట్ వద్ద, రామాయంపేట వద్ద, 765 - డి నేషనల్ హైవే మీద, నర్సాపూర్ ఎక్స్ రోడ్ వద్ద, ఎల్లారెడ్డి రూట్లో పోచమ్మరాల్ వద్ద చెక్ పోస్టులు ఉంటాయన్నారు.
ఆయా చెక్ పోస్ట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వెహికిల్ చెకింగ్ నిర్వహించి నిబంధనలకు మించి డబ్బు, మద్యం, తదితర వస్తువులు తరలిస్తే పట్టుకుని కేసు నమోదు చేస్తామనితెలిపారు.