పంచాయతీ ఎలక్షన్​కు రెడీ కావాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ

పంచాయతీ ఎలక్షన్​కు రెడీ కావాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ

ఆర్మూర్​/బోధన్​/నిజామాబాద్/వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు.  సోమవారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్​ డివిజన్​ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్, అసిస్టెంట్​ రిటర్నింగ్ ఆఫీసర్ల ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఈసీ జారీ చేసిన ఆర్డర్స్ పాటించాలన్నారు. ముందుగా ఎలక్షన్​ పట్ల పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని, రూల్స్​ను తప్పకుండా పాటించాలన్నారు. మొత్తం ప్రక్రియలో ఆర్​వోల రోల్​అత్యంత ప్రాధాన్యమైనదన్నారు. 

నామినేషన్ల స్వీకరణ, స్ర్కూట్నీ, విత్​డ్రా పట్ల జాగత్రగా ఉండాలని, సమయపాలన పక్కాగా పాటించడానికి గోడ గడియారాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లోకల్​ఓటర్లే అభ్యర్థులను ప్రతిపాదించాలని, అభ్యర్థుల తరపున నామినేషన్లు విత్​డ్రా చేయడానికి ప్రతిపాదకులు వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో తీయించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ సక్సెస్​ఫుల్​గా ముగిస్తే ఎలక్షన్​, కౌంటింగ్ సజావుగా ముగించడానికి వీలుంటుందన్నారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్​జారీ అయ్యాక డైలీ రిపోర్టును పంపాలని, అభ్యర్థుల నామినేషన్ పేపర్స్​ను స్కాన్ చేసి అప్​లోడ్ చేయాలన్నారు. ఒక అభ్యర్థి ఎన్ని సెట్ల నామినేషన్లు దాఖలు చేసినా అన్నింటినీ పరిశీలించాలని, తిరస్కరించిన వాటికి కారణాలు స్పష్టంగా రాయాలని చెప్పారు. 

బ్యాలెట్ పేపర్​లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ఆధారంగా ప్రింట్​చేయించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కోసం అనువైన బిల్డింగ్​ను ముందే గుర్తించి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, బోధన్ సబ్ కలెక్టర్​వికాస్​మహతో, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్​, డీఎల్​పీవోలు తదితరులు పాల్గొన్నారు.