
- పోచంపాడ్ హాస్టల్, పీహెచ్ సీని తనిఖీ చేసిన కలెక్టర్
బాల్కొండ, వెలుగు : అర్ధాంతరంగా నిలిచిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్కూల్ హెచ్ఎంను ఆదేశించారు. మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్ స్కూల్, పీహెచ్సీ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లోని కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మెటరీ రూమ్ ను సందర్శించి బియ్యం, కూరగాయలు, వంట నూనె నాణ్యతను పరిశీలించారు. సరుకుల స్టాక్ రిజిస్టర్ను చూశారు.
కిచెన్ లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్ ను వినియోగంలోకి తేవాలన్నారు. అనంతరం దవాఖానను సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మధుమేహం, టైపాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, అందిస్తున్న చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఇన్చార్జి, జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, ప్రిన్సిపాల్ గోదావరి, మెడికల్ ఆఫీసర్ రాకేష్, ఎమ్మార్వో సంతోష్ రెడ్డి, ఎంపీడీవో వనజ తదితరులు ఉన్నారు.