
వీర్నపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ప్రొసీడింగ్స్ పత్రాలు పొందిన వారు త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం వీర్నపల్లి మండల కేంద్రంలో రూ. 40 లక్షలతో నిర్మించనున్న స్వశక్తి భవన నిర్మాణానికి కలెక్టర్ భూమిపూజ చేశారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లాల్సింగ్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా గ్రౌండింగ్ అయిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం వీర్నపల్లిలోని కేజీబీవీని తనిఖీ చేశారు.
కిచెన్ను సందర్శించి, కూరగాయల నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించి ఓపీ రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్లను చెక్ చేశారు. ఆయన వెంట లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, కేకే మహేందర్రడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి రాందాస్, సెస్ డైరెక్టర్ మల్లేశ్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు తొలివిడత రూ. లక్ష రిలీజ్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 24 మంది లబ్ధిదారులకు రూ.లక్ష శుక్రవారం విడుదల చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ఝా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 1,023 ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు 300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా, వీటిలో బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న 24 ఇండ్లకు మొదటి విడత ఆర్థికసాయంగా రూ. లక్ష వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.