
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను క్వాలిటీతో నిర్మించేందుకు ఏర్పాటుచేసిన ట్రైనింగ్ ను మేస్త్రీలు సద్వినియోగం చేసుకొని ఇండ్లను క్వాలిటీగా నిర్మించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ తో కలిసి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.
ప్రభుత్వం అందించే రూ. ఐదు లక్షల తో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు మేస్త్రీలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్తమ క్వాలిటీతో ఇల్లు నిర్మించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న మేస్త్రీకి రోజు రూ. 300 అందిస్తామని తెలిపారు. అనంతరం మేస్త్రీలకు టీ షర్ట్స్, కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్, డీఈ నరేందర్, ఏఈ ప్రకాశ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
రూల్స్ మేర లేఔట్లను డెవలప్ చేయాలి
ప్రభుత్వ రూల్స్ మేరకు లేఔట్లను డెవలప్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్లు 898,900,93 ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా వెంచర్లలో సౌలతులను పరిశీలించారు. వెంచర్ల లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్హోల్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.