
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడ్గా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వేసవిలో తాగునీటి సరఫరాపై అడిషనల్ కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయించాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయవద్దని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బంది ఉన్నవారికి మహిళా సంఘాల ద్వారా రుణ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల చివరిలో, మే నెలలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డీఆర్డీవో చిన్న ఓబులేషు, జడ్పీ డిప్యూటీ సీఈవో గోపాల్ పాల్గొన్నారు.