
సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ పూర్తి అవగాహనతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారి పరిధిలో గల వివిధ బృందాలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రిటర్నింగ్ అధికారులకు వారు చేయాల్సిన పనులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. సువిధ యాప్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలకునిర్ణీత సమయంలోగా అనుమతులు ఇవ్వాలని, తిరస్కరించినట్లయితే కారణాలు తెలియజేయాలని సూచించారు. సి విజిల్ లో వచ్చిన ఫిర్యాదులను వంద నిమిషాల్లోగా పరిష్కరించాలని తెలిపారు. అక్రమ మద్యం, నగదు, వస్తువుల రవాణా, పంపిణీ పై ఆయా టీమ్లు మరింత నిఘా పెంచాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నోడల్ అధికారులు, డీఆర్ఓ నగేశ్, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.