
కొండాపూర్, వెలుగు: నోడల్ ఆఫీసర్లు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఆఫీసులో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎక్స్ పెండీచర్ మానిటరింగ్ కమిటీ, స్వీప్ కమిటీల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కమిటీలు చేస్తున్న పనులు, నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రిపోర్టులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చే దరఖాస్తులు, వాటిని పరిశీలించే విధానం, అనుమతులు జారీలో పాటించాల్సిన నిబంధనలు, తదితర అంశాల పై చర్చించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పెయిడ్ న్యూస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రచార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర వీడియోలు, సందేశాలు తదితర వాటిపై చర్చించి చర్యల నిమిత్తం సంబంధిత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలతో ముడిపడిన అంశాలను నిత్యం పరిశీలన చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ నగేశ్, డీపీఓ సురేశ్ మోహన్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీటీఓ కవిత, డీసీఓ ప్రసాద్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, డీపీఆర్ఓ విజయలక్ష్మి, డీడబ్లూఓ సంధ్యారాణి ,ఏవో పరమేశ్వర్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్దశరథ్ పాల్గొన్నారు.
రేపటిలోగా పరిష్కరించాలి..
పెండింగ్ ఫారాలు 6, 7 రేపటిలోగా పరిష్కరించాలని కలెక్టర్ శరత్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసు నుంచి ఐదు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 వరకు వచ్చిన ఫారం 6, ఫారం 7 లను రేపటిలోగా పరిష్కరించాలన్నారు. ఆర్ఓ కార్యాలయాలలో కంప్లైంట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ రూమ్, సి విజిల్, సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ పర్సన్స్ రాండమైజేషన్ చేయాలని , పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధులు, చేసుకోవాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు.