కొడిమ్యాల,వెలుగు: కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం నల్లగొండ ఆలయాన్ని సందర్శించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో రాజీ పడొద్దని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు సుమారు 20వేల మంది భక్తులు హాజరవుతారని, తాగునీటి సౌకర్యం, 24 గంటల విద్యుత్తు, తాత్కాలిక మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఘాట్ రోడ్డు ప్రాంతం ప్రమాదకరంగా ఉండడంతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, ఇన్చార్జి డీపీవో మదన్మోహన్, ఈవో వెంకన్న, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో స్వరూప ఉన్నారు.