
నారాయణపేట, వెలుగు: రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ, పన్నుల వసూళ్లపై రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామగ్రామాన మిషన్ భగీరథ తాగునీరు సరఫరా అవుతోందని, వచ్చే వేసవిలోనూ అలాగే సప్లై చేయాలన్నారు.
ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అధికారులు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాపై కమిషనర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పన్నుల వసూళ్లపై మాట్లాడారు. అంతకుముందు అధికారులతో రంజాన్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు.