![పంచాయతీ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-sikta-patnaik-suggests-that-panchayat-elections-should-be-conducted-properly_a9FXzE3gmZ.jpg)
నారాయణపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగారంలో బుధవారం ఆర్వో, ఏఆర్వోలకు మొదటి విడత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలు జరగకుండా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల, అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం, డీపీవో కృష్ణ, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో ఆర్వోలదే కీలకపాత్ర
గద్వాల : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ ఆఫీసర్లదే కీలక పాత్ర అని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.
నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. నామినేషన్లు, విత్ డ్రా, కౌంటింగ్ తదితర ఏర్పాట్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానాలు ఉంటే ట్రైనర్లతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీపీవో శ్యాంసుందర్ ఉన్నారు.