
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: నారాయణపేట మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హామీ ఇచ్చారు. మండలంలోని అప్పక్పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ తోపాటు కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైద్యసేవలు అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి మాట్లాడుతూ.. ఒకే సంవత్సరంలో ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీని ప్రారంభించామన్నారు. త్వరలో మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ.. నారాయణపేట మెడికల్ కాలేజీ పురోగతిలో ఉందని, కళాశాలకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు.
కార్యక్రమంలో పర్యావరణవేత్త కే. పురుషోత్తం రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్ రావు, డాక్టర్ విజయ్ సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబు, సామాజిక వేత్త కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి , రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైద్య నిపుణులు ఆదిత్య, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఇంట్లో కలెక్టర్ భోజనం
నర్వ, వెలుగు: సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మ గౌరవ పథకమని నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టర్ నర్వ మండలంలోని లంకాల గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. సన్నబియ్యం లబ్ధిదారు రేణుక ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు, అంగన్ వాడీ భవన నిర్మాణ పనులను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, నర్వ మండల ప్రత్యేక అధికారి హీర్యా నాయక్ పాల్గొన్నారు.