
నల్గొండ అర్బన్, వెలుగు : వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని రోగుల సహాయకులు దూషిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాత, శిశు సంరక్షణ విభాగం, ఇతర విభాగాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు, సమర్థవంతులైన డాక్టర్లు ఉన్నారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నంత మంది సిబ్బంది ఇక్కడ ఉన్నారని తెలిపారు.
ప్రతిఒక్కరూ వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ కొంత మంది కావాలని డాక్టర్లు, సిబ్బందిని వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా చేయడం సరికాదన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కావాలని రెచ్చగొట్టి దాడులు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, ఆస్పత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట డీఎంహెచ్వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్అరుణశ్రీ , డిప్యూటీ డీఎంహెచ్ వో వేణుగోపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.