ములుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను అమలుచేస్తూ ముందుకు సాగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర వేడుకలు ములుగులోని తంగేడు స్టేడియంలో జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్ అనంతరం పోలీసుల పరేడ్ లో భాగంగా ఎస్పీ డాక్టర్ శబరీష్ తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల కృషి ఫలితమే ఈ గణతంత్ర దినం అని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి తీసుకురావడంతో కుల, మత, ప్రాంతీయ బేధాభిప్రాయాలు లేకుండా జీవనం సాగిస్తున్నామన్నారు.
ములుగు జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా 7,69,007 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని తహలిపారు. అందుకు ప్రభుత్వం రూ.4.06కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ప్రజాపాలనలో 174జీపీల్లో మొత్తం 99,364 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ శబరీశ్, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ, ఓఎస్డీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, అదనపు ఎస్పీ సదానందం, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.