మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు ఉన్న పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. ఈ నెల10న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇచ్చి నులిపురుగులను నిర్మూలించాలని సూచించారు. నులి పురుగులతో పిల్లల్లో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. వైద్య, ఐసీడీఎస్, శిశు సంక్షేమ, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు, సిబ్బంది ఈ ప్రోగ్రామ్లో భాగస్వాములు కావాలని సూచించారు.
వనపర్తి: వనపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నులిపురుగుల మాత్రల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, ఈ నెల10న అటెండెన్స్ సమయంలో విద్యార్థులకు మాత్రలు తినిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నారాయణపేట: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్లో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు. అల్బెండజోల్ మాత్రల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. డీఎంహెచ్వో సౌభాగ్యలక్ష్మి, డాక్టర్లు శైలజ, జై చంద్రమోహన్, రాఘవేందర్, మల్లికార్జున్, ఐఎంఏ ప్రెసిడెంట్ గోవిందరాజు, అంజయ్య, జయ పాల్గొన్నారు.